ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 9:07 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాంజీగూడ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ కేరమేరి:

కేరమేరి:అర్జున్ సమాచారం:
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన సంక్షేమ శాఖ ఏఈ నజీమోద్దీన్‌తో కలిసి పాఠశాలలోని వివిధ వసతులను పరిశీలించారు.

పాఠశాల భవనం, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఆరోగ్యం తదితర అంశాలపై కూడా ఆరా తీశారు.

పాఠశాలలో నెలకొన్న సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని జాదవ్ అంబాజీ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు, విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
==============================